రివార్డ్ అందజేసిన ఇంచార్జ్ కమిషనర్ అభిషేక్ మహంతి
తెలంగాణ అక్షరం-వరంగల్ కమిషనరేట్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్పర్తి మండలానికి చెందిన ఇద్దరు మావోయిస్టు దంపతులు శనివారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం
హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత 27 తన ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా , పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేసారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు శనివారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా ఇన్చార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు.