సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
తెలంగాణ అక్షరం-కరీంనగర్
జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. చేతికి వచ్చే స్థితిలో మొక్కజొన్న మామిడి, వరి పంటలు నేలకొరిగాయన్నారు. జిల్లాలో చొప్పదండి, రామడుగు,గంగాధర, కరీంనగర్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు.
నెలల పాటు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట సాగు చేసిన రైతులు కళ్ళముందే పంట నేల పాలైతే రైతన్న గుండె తరుక్కుపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరి అగమ్య గోచరంగా తయారైందని, కౌలుకు భూములు తీసుకొని పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో నోటికాడి బువ్వ లాక్కున్నట్టు అయిందన్నారు. అకాల వర్షాలతో అన్నదాతకు తీరని నష్టం వాటిలిందన్నారు. జిల్లాలో కురిసిన వడగళ్ల వాన, గాలి బీభత్సానికి 336 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా నివేదిక రూపొందించారని, వాస్తవానికి ఇంకా ఎక్కువ ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.20 వేలు, వరి పంటకు ఎకరానికి రూ.30 వేలు, మామిడి పంటకు ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం అకాల వర్షాల మూలంగా పెద్ద ఎత్తున నష్టపోతూనే ఉన్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంటల బీమా పథకాన్ని ప్రతి పంటకు వర్తింపజేయాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.