- రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్
తెలంగాణ అక్షరం-వీణవంక
రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా త్వరలో హైదరాబాద్, జాతీయ స్థాయిలో రైతు సంఘాల నేతలు, మేధావులతో సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తెలిపారు.
మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారడం, రైతులకు చిన్న చూపు చూడడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే సంపన్నుల ఆధిపత్యంలోనే వ్యవస్థలు ఉండిపోయి కర్శకులకు న్యాయం జరగదని జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా జస్టీస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు శుభపరిణామని పోలాడి రామారావు పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తం చేసిన వ్యాఖ్యలకనుగుణంగా రైతులకు అన్ని రంగాల్లో తగిన గుర్తింపు కోసం ప్రత్యేక రిజర్వేషన్ల అమలుకు రాజకీయాల కతీతంగా రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్ష్య సాధనకు దీర్ఘ కాలిక ఉద్యమాన్ని నిర్మిస్తామని రామారావు ప్రకటించారు.