తెలంగాణఅక్షరం-వీణవంక
జమ్మికుంట పట్టణంలోని కాకతీయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీబీఎస్సీ కాకతీయ విద్యాసంస్థల బస్సు నడిరోడ్డుపై మూడు రోజుల నుండి ఉంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులు స్పందించి పాఠశాలల బస్సులను తక్షణమే పరిశీలించాలని డిమాండ్ చేశారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ సీబీఎస్ఈ సిలబస్ పేరుతో తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.