– తమ వివాహేతర సంబంధాలపై బెదిరించిన ఇద్దరు వ్యక్తులు
– తనకే అంటగడుతూ ప్రచారం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ కుటుంబీకుల ఆరోపణ
– నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంధువుల ఆందోళన
తెలంగాణఅక్షరం-వీణవంక/జమ్మికుంట
వివాహేతర సంబంధాలపై ప్రచారం చేస్తున్నావనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులు బెదిరించారనే నెపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కనపర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన బొంగోని కార్తిక్ (25)ను అదే గ్రామానికి చెందిన అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి కొండాల్ రెడ్డి వారి ఇంటికి పిలిపించుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంపై ఎందుకు ప్రచారం చేస్తున్నావని కార్తిక్ ను మందలించారు. అంతేకాకుండా మృతిడికే ఆ మహిళతో సంబంధం ఉందని బెదిరిస్తూ హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన కార్తిక్ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కార్తిక్ ను హుటాహుటిన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు.
కార్తిక్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని బంధువుల ఆందోళన
కార్తిక్ మృతి చెందాడని వైద్యులు తెలుపడంతో కోపోద్రోకులైన మృతుడి బంధువులు జమ్మికుంటలో వీణవంక-జమ్మికుంట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న జమ్మికుంట టౌన్ సీఐ బీర్పాటి రమేష్ సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిట్టిరెడ్డి కొండల్ రెడ్డి, అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డిలపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు.